
ఈనాడు, విశాఖపట్నం: ‘నైరుతి’ రుతుపవనాలు ఈ నెల 23 లేదా 24 నాటికి కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2009 తర్వాత ఇప్పుడే
గత ఏడాది రుతుపవనాలు సాధారణం (జూన్ 1) కంటే రెండు రోజులు ముందుగా మే 30న కేరళను తాకాయి. అదేరోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకూ విస్తరించాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయం. 2017లోనూ ఇలాంటి సందర్భమే చోటుచేసుకుంది. ఈ ఏడాదీ అలాగే జరుగుతుందని నిపుణుల అంచనా. ఐఎండీ డేటా ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతి ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రావడం ఇదే తొలిసారి కానుంది.
రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన..
అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. బుధవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశముందని ఐఎండీ తెలిపింది.
Discover more from BrandedNepal | Shop Nepal’s Best Local & Global Brands
Subscribe to get the latest posts sent to your email.

